| << Newer | Older >> |
on 2008/10/10 10:49:07
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్వరం మారింది. పార్టీని ప్రకటించిన నెల రోజుల తరువాత తొలిసారి రాష్ట్ర పర్యటనకు విజయదశమి సందర్భంగా గురువారం అరసవిల్లి లో ప్రజా అంకిత యాత్రకు శ్రీకారం చుట్టిన చిరంజీవి శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తన స్వరాన్ని పెంచారు. అధికార పార్టీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అన్ని పార్టీల వైఖరులను పరోక్షంగా ఎండ గడుతున్నారు, వ్యంగ బాణాలు విసురుతున్నారు. రాజకీయ పార్టీలపై చెణుకులు విసురుతున్నారు. చాలా వ్యూహాత్మకంగా తన యాత్రలో వ్యవహరిస్తున్నారు. యువతను, మహిళలను ఆకర్షించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తున్నారు. హామీలు వాగ్దానాలను చేస్తున్నారు. తెలుగు సినిమా రంగం లో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి రావడం తో తమ అభిమాన నటుణ్ణి చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక అభిమానుల సందడి చెప్పనక్కరలేదు. వారి అరుపులు కేకలతో చిరంజీవి ఏమీ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.
చిరంజీవి తన ప్రసంగాల సంధర్భంగా ఆవేశపూరిత, ఉద్వేగంగా ప్రసంగాలు చేస్తున్నారు. రాజకీయ నేతలపై విమర్శనాస్త్రాలను సందిస్తున్నారు. యువకులను ప్రజలను ఉత్తేజ పరిచేలా మాట్లాడుతున్నారు. స్థానిక సమస్యలతో పాటు వివిద వర్గాల ప్రజలను ఆకట్టుకోడానికి వారి వారి సమస్యలను కూడా ఉటంకిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. సామాన్య, మద్య తరగతి ప్రజల సమస్యలను పరిష్కరించడం లో గత, ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాల పై విరుచుక పడ్డారు. ప్రజలు పలురకాలుగా సమస్యల్లో చిక్కుకోడానికి ఇ ప్రభుత్వం,గత ప్రభుత్వం కారణం కదా అని ప్రజలను అడుగుతూ అవును అని వారి నుంచి సమాధానం చెప్పిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీని అధికారం లోకి రప్పిస్తే రాష్ట్రాన్ని సంతోషాండ్ర ప్రదేశ్గా మార్చి చూపుతానని హామీ ఇచ్చారు. తన ప్రసంగం ద్వారా యువతను అక్కట్టుకోడానికి ఆయన చేసిన ప్రయత్నం కొంతమేరకు ఫలితాన్ని ఇవ్వవచ్చునని అనిపిస్తోంది.
అందుబాటులో ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలు స్థాపిస్తే ప్రజలు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదని గత ప్రభుత్వాలు ఇ విషయాన్ని విస్మరించాయని విమర్శించారు. ఉత్తరంద్రలో వలసలు వెళ్ళడానికి ప్రధాన కారణం వెనకబాటు తనమని దాన్ని రూపుమాపదానికి తమ పార్టీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. రాజకీయం హుందాగా ఉండాలని, ఎద్దేవా చేయడానికో వ్యక్తిగత విమర్శలకో రాజకీయాలను ఉపయోగించకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి , రాష్ట్రాభి వృద్దికి పాటుపడాలని సమస్యలపై రాజకీయం తగదని సూచించారు. పొందూరు ఖద్దరు పరిశ్రమను ఆదుకోడానికి కృషి చేస్తామని, మూతపడిన ఆంధ్ర షుగర్స్ పునరుద్దరణకు పాటుపడతానని వాగ్దానం చేశారు.
చిరంజీవి ప్రసంగాలు ఆకట్టుకునేలా ఉన్నా ప్రజారాజ్యం పార్టీని అధికారం లోకి తీసుకొస్తే తాము అనుకున్నవన్ని చేస్తామని చెప్పడం మాత్రం సబబుగాలేదు. అన్నిటికి ఒకే మందు అన్న తీరులో తమ పార్టీ అధికారం లోకి వస్తే అన్న పద ప్రయోగాన్ని చిరంజీవి మరిచిపోవాలి. స్థానిక సమస్యలను ప్రస్తావించి దాన్ని కి పరిష్కారాన్ని సూచించాలి. తమ పార్టీ ఏమీ చేస్తోందో చెప్పాలి. వాగ్దానాలు చేయాలి. ఇక చిరంజీవి ప్రసంగాలను వింటే , ఆయన హావభావాలను చూస్తుంటే ఆయన ఎన్. టి. ఆర్. ను అనుకరిస్తున్నారని అనిపిస్తోంది. ఒక నటుడికి ఆది పనికి రాదు. ప్రజలతో మమేకం కావాలి. ఆది చాలా ముఖ్యం. ఇప్పుడు వస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది అభిమానులే. తన ప్రసంగాలు ప్రజలలో ఆలోచనలు రేకెత్తించాలి. దానికోసం చిరంజీవి కృషి చేయాలి అప్పుడే ఫలితం కనిపిస్తుంది. సమస్యలపై అక్కడికక్కడే స్పందించాలి. తొలి రోజు పర్యటనలో చిరంజీవి పర్వాలేదనిపించారు. రాను రాను రాటుదేలుతారని అనిపిస్తోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



