| << Newer | Older >> |
on 2008/10/8 12:22:05
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ సమైక్య వాదం తోనే ముందుకు సాగుతోంది. కేవలం అధికారం కోసం ఇపుడు సమైక్య వాదాన్ని పక్కన పెట్టి తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్న పార్టీ విధానం రానున్న ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందని టి. డి. పి. అధినేత చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి తెలంగాణా వ్యతిరేక నిర్ణయం కూడా కారణమని టి. డి. పి. గట్టిగా నమ్ముతోంది. పార్టీ ఎన్నికల్లో ఓటమికి తెలంగాణా అంశం కూడా ఒక కారణం కావచ్చు. అయితే దానికన్నా ప్రధానమైన కారణం అప్పటి టి. డి. పి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విదానాలు అన్న విషయాన్ని టి. డి. పి. మరిచి పోయినట్లుంది. ఎంతసేపు తన హైటెక్ విధానం గురించి.విజన్ 2020 గురించి ఆలోచించారే కాని రైతులను పూర్తిగా విస్మరించారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఉద్యోగుల్ల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత టి. డి. పి. ఓటమికి కారణాలు. డానికి తోడు కాంగ్రెస్ తో వామపక్షాలు, టి. ఆర్. ఎస్. పార్టీలు కలిసి టి. డి. పి. పై పోటీకి దిగడం తో పాటు వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపింది. డానికి తోడు తెలంగాణా అంశం కూడా టి. డి. పి. ఓటమికి కారణ మైంది.
గత నాలుగునారేళ్ల కాలం లో కాంగ్రెస్ తెలంగాణాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినంత మాత్రాన తెలంగాణాలో ఆ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోలేదు. తెలంగాణా అంశం చాలా సున్నిత మైనదని , తెలంగాణా సెంటీ మెంట్ ను తాము గౌరవిస్తున్నామని కాంగ్రెస్ ఈ నాలుగున్నరేళ్ల కాలం లో చెబుతూ వస్తోంది. యు. పి. ఏ. ప్రభుత్వం తెలంగాణా అంశం పై ప్రణబ్ నేతృత్వంలో ఒక కమిటీని వేసి అన్ని పార్టీల అభిప్రాయాన్ని సేకరించే పని అప్పటి నుంచి ఇప్పటి దాకా సాగిస్తూనే ఉంది. ఏకాభిప్రాయం ద్వారానే తెలంగాణా సాద్యం అని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది.
కాంగ్రెస్ తమను మోసం చేసిందని టి. ఆర్. ఎస్.విమర్శలు గుప్పించింది. యు. పి. ఏ. ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందిన కె. సి. ఆర్. , నరేంద్రలు తెలంగాణా అంశాన్ని చాలాకాలం మరిచిపోయారు. రాష్ట్రం లో కూడా టి. ఆర్. ఎస్. పదవులు పొంది అధికార మత్తులో మునిగి పోవడం తో తెలంగాణా ఉద్యమం మరుగున పడి పోయింది. 2006 లో తన తప్పు తెలుసుకున్న టి. ఆర్. ఎస్. ఇక కాంగ్రెస్ ద్వారా తెలంగాణా రాదని నిర్దారించుకొని మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టింది. ఆ తరువాత కె. సి. ఆర్. తన ఎం. పి. పదవికి రాజీనామా చేసి కరీంనగర్ నుంచి తిరిగి పోటీ చేసి రెండు లక్షల కు పైగా ఓట్ల మెజారిటీ తో విజయం సాదించారు. తెలంగాణా ప్రజలు తన వెంట ఉన్నారని ఆయన నమ్మరు. మరోసారి తన పార్టీకి చెందిన ఎం. ఎల్. ఏ లతో పాటు తాను కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తలపడ్డారు. ఆ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు టి. ఆర్. ఎస్. కు గట్టిగానే బుద్ది చెప్పారు.కె. సి. ఆర్. మెజారిటీ రెండు లక్షల నుంచి పదిహేను వేలకు పడిపోయింది. కొందరు ఓటమి పాలయ్యారు. హరీష్ రావు మాత్రం మంచి మెజారిటీతో గెలిచారు. ఉధ్యమాన్ని విస్మరించిన కారణంగానే టి. ఆర్. ఎస్. ఘోరంగా దెబ్బతింది. ప్రతివారూ తెలంగాణా పేరు చెప్పి తమను మోసం చేస్తున్నారని తెలంగాణా సిద్దించదని ప్రజలు నమ్మడం వల్లనే కె. సి. ఆర్. కు భంగపాటు తప్పలేదు.
ఉప ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే తెలంగాణా ప్రాంతంలో తెలంగాణా సెంటీ మెంట్ తోపాటు తెలంగాణా అభివృద్ది కూడా ముఖ్యమని గ్రహించినట్లు అర్థం అయింది. అందుకే ఉపఎన్నికల్లో అభివృద్దికి , తెలంగాణా సెంటిమెంట్ ను గౌరవించిన సమైక్య వాద పార్టీలను కూడా ఆదరించారు. అయితే తాము తెలంగాణకు అనుకూలమన్న ప్రకటన చేసిన కారణంగానే తమకు సీట్లు వచ్చాయని టి. డి. పి. నమ్మితే, తాము చేసిన అభివృద్దే తమను గెలిపించిందని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంది. సమైక్య వాదాన్ని మొదటి నుంచి వినిపిస్తూ వస్తున్న సి. పి. ఎం., పార్టీ తమది ఇప్పటికీ సమైక్య వాదమెనని అయితే తాము తెలంగాణకు అడ్డుకాబోమని చెబితే , తెలంగాణకు తాము అనుకూలమన్న విషయాన్ని టి. డి. పి. చెప్పడమే కాదు తన సమైక్య విధానాన్ని మార్చుకుంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోనుంది. విజయ దశమి కనుక గా తెలంగాణా ప్రజలకు తీపి కబురు చెప్పడానికి నిర్ణయించుకుంది. ఎన్నికల ముందు టి. డి. పి. తీసుకున్న నిర్ణయం ఓటు రాజకీయమన్నది బహిరంగ రహస్యం. మొన్నటిదాకా తమది సమైక్యవాదమేనని వాదిస్తూ, ఉప ఎన్నికల ఫలితాల అనంతరం కూడా సమైక్య వాదం గెలిచిందని పండుగ చేసుకున్న టి. డి. పి. పార్టీ కి చెందిన సమైక్య వాదులకు పార్టీ నిర్ణయం మింగుడు పడటం లేదు. టి. డి. పి. తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నా రానున్న ఎన్నికల్లో ఆది ఓట్ల వర్షం కురిపిస్తుందా అన్నది ఇప్పటికైతే మిలియన్ డాలర్ల ప్రశ్న అనే చెప్పాలి.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



